జైపూర్ (పింక్ సిటి), - TopicsExpress



          

జైపూర్ (పింక్ సిటి), రాజస్థాన్ రాచరికానికి చిహ్నం రాజస్థాన్. దానికి చక్కటి ఆనవాలు రాజస్థాన్ రాజధాని జయ్‌పూర్ నగరం. 1727 వ సం.లో సవాయ్ రెండవ జయ్‌సింగ్ కట్టించిన నగరం కావడంతో జయ్‌పూర్‌గా నామకరణం అయింది. జైపూర్ ఢిల్లీ, ఆగ్రా నగరాలతో పాటు కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ గా టూరిజం లో పేరు. ఇండియన్ టూరిజం ప్రతిష్టాత్మకంగా చూపించుకునే బాందినీ ప్రింట్ చేసిన తలపాగాలు, కుందన్ ఆభరణాలు ధరించిన యువతులు, ఒంటెల సవారీల వంటి వాటికి పుట్టిల్లు ఇది. జయ్‌పూర్‌లో అడుగుపెట్టిన తర్వాత నగర పర్యటన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఒక పట్టాన అర్థం కాదు. ముఖ్యంగా హవామహల్, నహర్‌ఘర్ ఫోర్ట్, అంబర్ ఫోర్ట్, జయ్‌ఘర్ ఫోర్ట్, సిటీప్యాలెస్, జల్‌మహల్, రామ్‌బాఘ్ ప్యాలెస్, సిసోడియా రాణి కా బాఘ్, ఆల్బర్ట్ మ్యూజియం, జంతర్‌మంతర్ మొదలైనవి చూడవలసినవి. నగరానికి అన్ని వైపులా స్వాగత ద్వారాలు ఉంటాయి. లోపలికి అడుగు పెడితే ఆధునికత సంతరించుకుంటున్న పాశ్చాత్యఛాయలు కనిపిస్తాయి, పర్యాటక శాఖ ఊరించే కోటలను చూడాలంటే ఓల్డ్‌సిటీకి వెళ్లాలి. పాత నగరం మొత్తానికి ప్రహరీ గోడ ఉంటుంది. లోపల మొత్తం గులాబీమయమే. బ్రిటిష్ యువరాజు ఎడ్వర్డ్ 1876లో భారత్‌లో పర్యటించాడు. ఆ యువరాజుకి ఘనస్వాగతం పలకడానికి జయ్‌పూర్ రాజు సవాయ్‌రామ్‌సింగ్ ప్రతి నిర్మాణానికీ గులాబీ రంగు వేయించాడు.అందువల్ల పింక్‌సిటీ అనే పేరు అప్పటి నుంచే వచ్చిందంటారు. నగరం మొత్తం రాజస్థానీ, మొఘల్ నిర్మాణశైలుల సమ్మేళనం. ప్యాలెస్‌లలో తోటలు చక్కటి ప్రణాళికతో ఉంటాయి. ఏం చూడాలి? సిటీప్యాలెస్ సిటీప్యాలెస్‌కి స్వాగతమందిరం ముబారక్‌మహల్. ఇక్కడి నుంచి ముందుకెళ్తే రెండవ మాన్ సింగ్ మ్యూజియం కనిపిస్తుంది. రాజకుటుంబాల జీవనశైలికి ప్రతీక ఇది. ఎంబ్రాయిడరీ దుస్తులు, బెనారస్ పట్టుచీరలు, రాజులు ధరించిన పైజామాలు, ఛోగాలు(చొక్కాలు), జమావర్ శాలువాలు, వడ్డాణాలు..మొదలైనవి ప్రదర్శన లో ఉన్నాయి . రాజపుత్రులు ఆజానుబాహులు అనడానికి నిదర్శనం మొదటి మాధోసింగ్ దుస్తులే. ఈ రాజు ఏడడుగుల పొడవు ఉండేవాడని నిర్ధారిస్తున్నట్లు ఉంటాయివి. మహారాణి ప్యాలెస్‌లోని ఆయుధాగారంలో ఐదు కిలోల బరువైన కత్తి ఉంటుంది. రాజులు వార్థక్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వాహ్యాళికెళ్లేప్పుడు ఉపయోగించే చేతికర్రలు కూడా ఉంటాయి. మరో సెక్షన్‌లోకి అడుగుపెడితే ఫిరంగులు, డబుల్ బ్యారెల్‌గన్, పిస్టల్‌లు ఉంటాయి. ఇక్కడ కనిపించే నెమలిపిడికత్తులు, పర్షియా ఆయుధాలు, దక్కనులో వాడే చేతి విల్లంబులు, బాణాలు... ఒక ఎత్తయితే కెంపులు, మరకతాలు పొదిగిన కత్తి మరో ఎత్తు. ఇది మహారాజా సవాయ్ రామ్‌సింగ్‌కు బ్రిటిష్ రాణి విక్టోరియా బహూకరించిన కత్తి. మ్యూజియం దాటి బయటకు వస్తే... గైడ్ వెంటే పర్యాటకుల అడుగులు దివాన్ ఈ ఖాస్, దివాన్ ఇ ఆమ్ వైపు పడతాయి. ఇవి రాజు ఆంతరంగికులను, ప్రజలను కలిసే మందిరాలు. దివానీ ఆమ్ (ఆర్ట్ గ్యాలరీ) పై కప్పుకి ఉన్న చిత్రలేఖనాలలో పొదిగిన రంగురాళ్లు ఇప్పటికీ మెరుపులీనుతుంటాయి. పెద్ద క్రిస్టల్ షాండ్లియర్ చూపుతిప్పుకోనివ్వదు. గ్యాలరీలోని చిత్రలేఖనాలలో రామాయణ సన్నివేశాలే ప్రధానం. మరికొంచెం ముందుకుపోతే చంద్రమహల్... ఈ మందిరం నుంచి గోవింద్‌జీ ఆలయం కనిపిస్తుంది. కృష్ణుని భక్తులైన రాజపుత్రులు ఆలయం కనిపించేటట్లు ఈ మహల్‌ను కట్టించుకున్నారు. సిటీప్యాలెస్‌లో అత్యంత ఆకర్షణీయమైనవి వెండికూజాలు. మహారాజా రెండవ మాధోసింగ్ యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు రెండు కూజాల్లో గంగనీరు తీసుకెళ్లాడు. ఒక్కో కూజా సామర్థ్యం తొమ్మిది వేల లీటర్లు. యూరప్ పర్యటన కోసమే ఈ కూజాలను చేయించారు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద వెండి పాత్రలుగా గిన్నిస్ బుక్‌లో రికార్డుకెక్కాయి. జంతర్‌మంతర్! ఇది ఖగోళశాస్త్ర ప్రావీణ్యానికి ప్రతీక. ఢిల్లీ జంతర్‌మంతర్‌కి మాతృక కూడ. సవాయ్ జయ్‌సింగ్ నిర్మించిన ఐదు అబ్జర్వేటరీల్లోకి ఇదే పెద్దది (మిగిలినవి వారణాసి, ఉజ్జయిని, మధురలలో). జంతర్ మంతర్ ఒక రాయితో నిర్మితమైన వేధశాల. .దీనిని 1728 - 1734 సం.లలో స్థానిక సమయం, ఎత్తు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవి కొలవడానికి మరియు గ్రహణాలు గుర్తించడానికి నిర్మించారు. హవామహల్ జంతర్ మంతర్ నుంచి బయటకు వెళ్తే స్వాగతం పలికే నిర్మాణం హవామహల్. జయ్‌పూర్‌కి చిహ్నంగా పరిగణించే హవామహల్ కృష్ణుని కిరీటాన్ని పోలి ఉంటుంది. గవాక్షాల మాటున ఉన్న గదుల్లోంచి రాణివాసపు స్త్రీలు నగరంలో జరిగే వేడుకలు చూసేవారు. జయ్‌ఘర్ ఫోర్ట్‌ ఇందులో లో అడుగుపెడితే రాజమందిరాలు, ఉద్యానవనాలు, రిజర్వాయర్‌లు, ధాన్యాగారం, ఆయుధారాగం, ఆలయాలు ఉంటాయి. ఇది ఉంది అది లేదు అనడానికి వీల్లేనంత పకడ్బందీగా ఉంటాయి ఈ కోటలు. జగత్ శిరోమణి ఆలయంలో భక్తమీరా కొలుస్తున్న కృష్ణుని విగ్రహం ఉంటుంది. ఆల్బర్ట్ హాల్ రామ్ నివాస్ గార్డెన్‌లో ఆల్బర్ట్ హాల్ ఉంది. రూ .4 లక్షల కరువు సహాయ పనుల కింద సంవత్సరం 1886 లో మహారాజా సవాయి రామ్ సింగ్ దీనిని నిర్మించాడు. ప్రస్తుతం హాల్ ను మ్యూజియం ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు మమ్మీ, పర్షియాలో తయారైన బంగారు తివాచీ ప్రధాన ఆకర్షణలు. అంబర్ కోట జయ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపుగా పదికిలోమీటర్లు ప్రయాణిస్తే అంబర్ కోట వస్తుంది.తొలి రాజధాని అంబర్! జయ్‌పూర్ నిర్మాణానికి ముందు పాలన ఈ కోట నుంచే జరిగేది. హిందూ మరియు మొఘల్ మిశ్రితమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించారు. ఏనుగు అంబారీ ఎక్కి కోట మీదకు వెళ్లవచ్చు. శీష్ మహల్, జైమందిర్, దివాన్-ఇ-ఆలం, సిఖ్ నివాస్ మొదలైనవి ఇక్కడ చూడదగినవి. జల్ మహల్ మాన్ సాగర్ లో కొంత భాగం మునిగి ఉన్న ఈ ఎర్ర రాతి కట్టడం జైపూర్ నుండి 6.5 కి.మీ. దూరంలో ఉన్నది.ఈ అందమైన నిర్మాణం ను చూడవలసిందే. శీతాకాలంలో ఇక్కడికి వలస పక్షులు వస్తాయి. శీతాకాలంలో ఇక్కడికి వలస పక్షులు వస్తాయి. సిసోడియా రాణీకా బాగ్ ఈ గార్డెన్ జయ్‌పూర్‌కి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఆగ్రా రూట్‌లో వస్తుంది. సవాయ్ జయ్‌సింగ్... సిసోడియా యువరాణిని మనసు పడి వివాహమాడి, ఆమెకు ఇష్టమైనట్లు ఉద్యానవనాన్ని నిర్మించాడు. రాణి కాలు కింద పెట్టకుండా ఉద్యానవనంలో విహరించేటట్లు టై గార్డెన్ ఏర్పాటు చేశాడు. ఇంకా ఏమేం చూడవచ్చు? విద్యాధర గార్డెన్ బాఘ్.: రెండవ జయ్‌సింగ్ కొలువులో ప్రధాన వాస్తుశిల్పి విద్యాధరుడు. సిసోడియా రాణి కా బాఘ్ వంటి అద్భుత నిర్మాణాల రూపకర్త. అందుకే ఒక ఉద్యానవనానికి విద్యాధరుడి పేరు పెట్టారు. కనక వృందావన్ గార్డెన్: నహర్ఘడ్ కొండ కింద జైపూర్ -అంబర్ రోడ్డు లో గల పవిత్ర భావన తో కూడిన అందమైన గార్డెన్ గల్తాజి టెంపుల్ లేదా మంకీ టెంపుల్ : జైపూర్ లో గల్తాజి టెంపుల్ ఒక మణి రత్నం. ఈ టెంపుల్ లో సూర్య భగవానుడు దైవం. ఈ దేవాలయంలో కోతులు అధిక సంఖ్యలో వుండటంచే, ఈ టెంపుల్ కు మంకీ టెంపుల్ అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ పరిసరాలనుండి , జైపూర్ నగర సుందర దృశ్యాలు చూడవచ్చు. ఏమేమి కొనవచ్చు... ఎక్కడ కొనాలి? జైపూర్ చెప్పులకు (జూటీ) రామ్‌గంజ్ బజార్, టై అండ్ డై దుస్తులకు కృష్ణపాల్ బజార్, అలంకరణ వస్తువుల కు మనిహారన్ కా రాస్తా, తివాచీలకు సుభాష్ చౌక్, మార్బుల్ కళాకృతులకు ఖజనో కా రాస్తా, హస్తకళలు, నీలిరంగు పింగాణీ వస్తువుల కోసం సంగనెర్ గ్రామానికి వెళ్లాలి. ఒంటె చర్మంతో చేసిన బ్యాగ్‌లు, చెప్పులు, పర్సులకు విదేశాల్లో డిమాండ్. ఇక జయ్‌పూర్ కుందన్, జేడ్ ఆభరణాల దుకాణాలు ఇక్కడ చాలానే ఉంటాయి. ఎలా వెళ్లాలి? విమానంద్వారా జైపూర్ విమానాశ్రయం చేరుకోవచ్చు. జైపూర్ రైల్వే జంక్షన్. కాచిగూడ నుంచి జైపూర్ జంక్షన్‌కి నార్త్‌వెస్టర్న్ రైల్వే రైళ్లు ఉన్నాయి. మైసూర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి జైపూర్‌కి టిక్కెట్టు ధరలు స్లీపర్‌లో రూ600, ఏసీ త్రీటైర్‌లో రూ 1500, ఫస్ట్‌క్లాస్‌లో రూ 4000 ఉంటాయి. సికింద్రాబాద్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ దాదాపుగా ఇంతే. ప్రయాణం 30 గంటలు. ఎక్కడ ఉండాలి? హోటల్ పెర్ల్ ప్యాలెస్... ఒక రోజు డబుల్ రూమ్ (షేరింగ్ బాత్‌రూమ్) అద్దె రూ350, ఏసీ డబుల్ రూమ్ రూ950, ఫ్యామిలీ రూమ్ (4-6 బస) రూ1,100. వీటిలో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉండదు. అనురాగ్ విల్లా... నాన్‌ఏసీ డబుల్ రూమ్ రూ800, సూపర్ డీలక్స్ గార్డెన్ వ్యూ గదికి రూ2000. రామ్‌బాఘ్ ప్యాలెస్‌లో బస చేయాలంటే ఒక రోజుకి 19 వేలు. వీటితోపాటు ఒక రాత్రికి ఆరేడు వందలు చార్జ్ చేసే వినాయక్ గెస్ట్‌హౌస్ ఇంకా ఇతర హోటల్ లు వంటివీ ఉన్నాయి. భోజనం ఎలా? రాజస్థాన్ సంప్రదాయ భోజనం రుచి చూడాలంటే జోరి బజార్‌లోని ఎల్‌ఎంబి రెస్టారెంట్‌కి, స్వీట్స్‌కి రావత్ మిస్థాన్ భండార్‌కి వెళ్లాలి. గుజరాతీ రుచుల కోసం అన్నపూర్ణ, పనీర్ బటర్ మసాలా కోసం ‘సూర్య మహల్’, విదేశీ రుచులకు ‘కాపర్ చిమ్నీ’, ఇటాలియన్ పిజ్జా తినాలంటే పిజ్జాహట్, చిరుతిళ్లకు ఇండియన్ కాఫీ హౌస్‌కు వెళ్లవచ్చు. ఎప్పుడు వెళ్లవచ్చు? వాతావరణం? ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతాయి. జూన్ - సెప్టెంబరు వర్షాకాలం. అక్టోబర్, నవంబరు ఆహ్లాదంగా ఉంటుంది. డిసెంబర్ - ఫిబ్రవరిఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోతాయి. మార్చిలో బావుంటుంది.
Posted on: Sat, 20 Sep 2014 10:48:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015