ఒక్కొక్క స్థాయిలో సాధనను ముందుకి తీసుకుని వెళ్ళ దానికి ఒక్కొక్క రకమైన పనిముట్టు మన పనిని సుసాధ్యం చేస్తుంది. ఉదాహరణకి ఒక కొమ్మని చేత్తో విరగ కొట్ట వచ్చ్చు. ఇంకా కొంత గట్టిది అయితే చాలా కష్ట పడ వలసి ఉంటుంది. అదే ఒక గొడ్డలి కాని లేక కత్తి కాని ఉపయోగిస్తే పని తేలిక అవుతుంది. అదే సమయంలో ఎక్కువ చితుకులు తయారు చేసుకో వచ్చు. అట్లాగే ఒక స్థాయిలో ఉన్నవారు చేసే జపానికి మాల లేకపోతె ధ్యానం కుదరదు. మనస్సు పరి పరి విధాల పయనిస్తూ ఉంటుంది. ధ్యానం కుదరక పోతే మనము కాసేపు చేసిన ధ్యానమే ఎంతో ఎక్కువ సేపు లేక ఎంతో ఎక్కువ చేసినట్లు గా అనిపిస్తుంది. సాధారణంగా ఒక నామ వెయ్యి జపం చేయటానికి అరగంట పడుతుందనుకొండి. అదే స్థాయి దాటని వారికి మాల లేకుండా జపం చెస్తే మనసు ధ్యానంలో ఉండకుండా చీటికి మాటికీ నువ్వు ఎంతో సేపు నించి చేస్తున్నావు. ఎప్పుడో వెయ్యి దాటి పోయి ఉంటాయి అని హెచ్చరిస్తూ ఉంటుంది. 10 సార్లు జపం చేస్తే 100 సార్లు చేసినట్లుగా భావన డ్రిల్లింగ్ చెస్తూ వుంటుంది. కళ్ళు తెరిచి గడియారం చూడగానే ఆ గడియారం వెక్కిరింపుగా ఒరేయ్ వెధవా నువ్వు చేసినది 5 నిమిషాలు మాత్రమె. జపం పై ధ్యానం పెట్టు అంటుంది. మళ్ళీ కళ్ళు మూసుకుంటే ధ్యానం కుదరడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోగా మనసు ఇవ్వాళ్ళ వద్దు, రేపు చేద్దువు గాని ఇంక లే అని తరమడం మొదలు పెడుతుంది. అదే చేతిలో ఒక మాల ఉన్నదనుకోండి అప్పుడు అసలు స్థితి వెంటనే తెలుస్తూ ఉంటుంది. కళ్ళు పూర్తిగా తెరవము కనుక ధ్యానం disturb కాకుండా ఉంటుంది. మొదట్లో మాలపై ధ్యానమున్నప్పటికీ కొంత కాలానికి లక్ష్యం వైపు మనసు మళ్ళుతుంది. నేను వ్రాస్తున్నది నా లాంటి ప్రాథమిక స్థాయిలో ఉన్న వారికి మాత్రమె. ఈ స్థాయిని దాటిన వారికి ఎటువంటి మాల అవసరము లేదు. వారు మూర్తిని తలుచుకో గానే తన్మయత్వం లోకి జారుకుంటారు. అప్పుడు ఆత్మ, మనస్సు అన్నీ రమిస్తూ ఉంటాయి. వారికి నిజానికి జపం కూడా అవసరం లేదు. కాకపొతే అట్టి స్థితి నిలుపుకోడానికి, వారు నిత్య జపం చేస్తూనే ఉంటారు. ఎట్టి కర్మ చేస్తున్నప్పటికీ వారి మనసు భగవన్నామము జపిస్తూనే ఉంటుంది. అట్లాంటి సమయంలో వారికి ఎట్టి మాల అవసరము లేదు. అంటే అది 24X7 జపం అన్న మాట. (మరి నిద్ర పోతున్నప్పుడు అని అనుమాన పడకండి .. నిద్ర పొయే ముందు ఏదైతే జపం లేక ధ్యానం చేస్తున్నారో లేక నిద్ర లేవగానే వెంటనే మొదటిగా దేన్ని ధ్యానం చేస్తున్నారో నిద్రలో కూడా అదే ధ్యానంలో ఉన్నట్లే లెక్క). ఇక ఏ మాల ఎందుకు వాడుతారు అన్నది వారు ఎటువంటి జప ఫలం ఆశిస్తున్నారు అన్నదానిని బట్టి వుంటుంది. జప మాలికలు రెండు విధములు - నియత అని, మరొకటి అనియత అని. నియత మాలిక మూల మంత్రము జపించుటకు స్వీకరించ బడేది. మిగిలిన అన్ని జపాలకు వినియోగించు మాలిక అనియత మాలిక. మూలమంత్ర జపము కొరకై ఉంచిన నియత మాలికను ఇతరులు చూచునట్లు ప్రదర్శింప రాదు. జపించు సమయమున యోగియగు వాడు ఎప్పుడును గోముఖ విధానముననే జపింప వలెను. ఈ నియమముతో ఉంచి జపించుట వలన మంత్రములు త్వరగా సిద్ధించును. జపమాల రుద్రాక్షలతో కాని, తామర పూసలతో కాని, స్ఫటికములతో కాని, పగడములతో కాని, ముత్యములతో కాని, తులసి కర్ర తో చేయు పూసలతో కాని తయారు చేయవలెను. స్ఫటిక జపమాలతో జపించుట వలన మోక్షము సిద్ధించునని చెప్పుదురు. ముత్యముల మాలిక కీర్తి దాయకమని చెప్పుదురు. రుద్రాక్ష మాలిక, తామరపూసల మాలిక సర్వ సిద్ధులను ఒసంగునని; పగడములచే నిర్మించిన మాలిక ఆయుర్వ్రుద్ధిని కలిగించునని; తులసి పూసల మాలిక చిత్త శుద్ధిని కలిగించునని చెప్పుదురు.
Posted on: Sat, 16 Nov 2013 16:34:40 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015